ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 9:45 pm Posted by : Shiva Kumar BS

మానకొండూరులో బీఎల్ఏల అవగాహన, శిక్షణ సదస్సు

పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: కూన శ్రీశైలం గౌడ్

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూరు నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) అవగాహన మరియు శిక్షణ సదస్సు ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లిలోని సాయిరాం గార్డెన్స్‌లో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్, మాజీ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఎల్ఏ శిక్షణ కార్యక్రమ ఇన్‌చార్జ్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతం మరియు ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించడంలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి బూత్ స్థాయి ఏజెంట్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. నకిలీ ఓటర్ల తొలగింపునకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ, బూత్ లెవెల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ శిక్షణ సదస్సులో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్‌లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.