ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 8:20 pm Posted by : Shiva Kumar BS

రాజ్యాధికార సమరభేరికి ఆహ్వానం

కార్మికుల చేతులు అసెంబ్లీలో చట్టాలు చేసే స్థాయికి చేరాలి: పటేల్ వనజక్క

ఆదాబ్ సైబరాబాద్, భువనగిరి : తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి” బహిరంగ సభకు సంబంధించి పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క నేతృత్వంలోని బృందం కల్లు గీత కార్మికులను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేసింది.

ఈ సందర్భంగా బాలరాజ్ గౌడ్, శివ గౌడ్‌లను మర్యాదపూర్వకంగా కలిసి సభకు హాజరుకావాలని కోరారు. అనంతరం కల్లు గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారి అభిప్రాయాలు, ఆవేదనలను విన్నారు.

ఈ సందర్భంగా పటేల్ వనజక్క మాట్లాడుతూ కల్లు గీసే చేతులు కేవలం శ్రమకే పరిమితం కాకుండా అసెంబ్లీలో చట్టాలు చేసే స్థాయికి ఎదగాలని అన్నారు. తరతరాలుగా శ్రమిస్తున్న బీసీ వర్గాలు రాజకీయంగా వెనుకబడిపోయాయని, వారి సమస్యలు శాసనసభల్లో వినిపించాలంటే బీసీలకు రాజ్యాధికారం అవసరమని పేర్కొన్నారు.

బీసీ వర్గాల హక్కులు, అవకాశాలు, గౌరవం కోసం అన్ని వర్గాలకు చెందిన బీసీలు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజాన్ని నిర్మించే శ్రమజీవులకు పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జూలై 5న భువనగిరిలో జరిగే రాజ్యాధికార సమరభేరి సభకు భారీ సంఖ్యలో హాజరై బీసీల రాజకీయ సాధికారతకు మద్దతు తెలపాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గిరగాని భిక్షపతి గౌడ్, బత్తిని మీన, అర్కటి పావని, అర్కటి శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు.