ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : నియోజకవర్గంలో తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ (టీపీఎంసీ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ నివాసంలో ఘనంగా నిర్వహించిన శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొలన్ హన్మంత్ రెడ్డి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. రాష్ట్రంలో ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, అమ్మవారి కృప ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రజల జీవితాల్లో ఆనందం, అభివృద్ధి నెలకొనాలని కోరుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు, భక్తులు మరియు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది.