ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో ఉన్న రాజీవ్ గృహకల్ప (ఆర్జీకే) కాలనీలో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
పాదయాత్ర సందర్భంగా స్థానిక ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించిన హన్మంత్ రెడ్డి, కాలనీలో ప్రధానంగా తాగునీటి సమస్యతో పాటు చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. కాలనీవాసులు ధైర్యంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. తాగునీటి సమస్యలు, చిరు వ్యాపారుల ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులతో సమన్వయం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి గణేష్, డీసీసీ అధికార ప్రతినిధి భారత్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చంద్రయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, కృష్ణ గౌడ్, రషీద్, పిల్లి ఆంజనేయులు, బుచ్చిరెడ్డి, చంద్రశేఖర్, లక్ష్మణ్, శ్రీనివాస్, యువరాజ్, మహిళా నాయకులు కౌసల్య, చంద్రకళ, అనిత రెడ్డి, మాధవి రెడ్డి తదితరులు, కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.