ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 9:14 pm Posted by : Shiva Kumar BS

హైదరాబాద్‌లో వర్షపు నీటి సంరక్షణకు “జల సంచయ్” కార్యక్రమం

  • భూగర్భ జలాల పరిరక్షణ, వరదల నివారణే లక్ష్యం

ఆదాబ్ సైబరాబాద్, మేడ్చెల్-మల్కాజిగిరి: హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నిర్మాణాలు, తగ్గిపోతున్న భూగర్భ జలాల నేపథ్యంలో వర్షపు నీటి సంరక్షణ (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్) అత్యంత అవసరంగా మారింది. నగరంలోని అధిక భాగం గట్టి గ్రానైట్ భూభాగం కావడంతో వర్షపు నీరు భూమిలోకి సులభంగా ఇంకకపోవడం, మరోవైపు కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం వల్ల వర్షపు నీరు నేరుగా డ్రైనేజీల్లోకి చేరి వరదలకు కారణమవుతోంది.

ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పర్వతిని ఆంజనేయ వర్మ ఆధ్వర్యంలో రూపొందించిన “జల సంచయ్” కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. వర్షపు నీటిని వృథా కాకుండా సేకరించి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు నగరంలో వరదల తీవ్రతను తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

భూగర్భ జలాల పెంపునకు తోడ్పాటు

నగరంలో అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు పెరగడంతో భూగర్భ జలాల వినియోగం భారీగా పెరిగింది. దీంతో అనేక ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఎండిపోతున్నాయి. “జల సంచయ్” కార్యక్రమం ద్వారా భవనాల పైకప్పులపై పడే వర్షపు నీటిని ప్రత్యేక రీఛార్జ్ పిట్స్‌ (ఇంగుడు గుంతలు) ద్వారా భూమిలోకి మళ్లించి భూగర్భ జలాల స్థాయిని పెంచే అవకాశం ఉంది.

వరదల సమస్యకు చెక్

కూకట్‌పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల సమయంలో రోడ్లు జలమయం కావడం సాధారణమైంది. డ్రైనేజీల సామర్థ్యాన్ని మించి వర్షపు నీరు ప్రవహించడంతో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వర్షపు నీటిని పడిన చోటే నిల్వ చేసి భూమిలోకి మళ్లించడం ద్వారా డ్రైనేజీలపై ఒత్తిడి తగ్గి, వరదల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాంకర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింపు

వేసవికాలంలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా గృహ అవసరాలు, తోటల నిర్వహణ, శుభ్రపరిచే పనుల కోసం ఉచితంగా నీటిని వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. దీంతో కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం కూడా తగ్గుతుంది.

నాలుగు దశల్లో అమలు

“జల సంచయ్” కార్యక్రమాన్ని కాలనీలు, అపార్ట్‌మెంట్లు మరియు వ్యక్తిగత గృహాల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

మొదటి దశలో భవనాల పైకప్పుల విస్తీర్ణం, ప్రాంతీయ వర్షపాతం ఆధారంగా ఎంత నీటిని సేకరించవచ్చో అంచనా వేస్తారు. అనంతరం రీఛార్జ్ పిట్స్, ఫిల్టర్ వ్యవస్థలు, నిల్వ ట్యాంకుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. మూడో దశలో నిర్మాణ పనులు చేపట్టి వర్షపు నీటిని సేకరించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. చివరి దశలో నిర్వహణ, అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యవస్థ నిరంతర వినియోగాన్ని నిర్ధారిస్తారు.

ప్రజల భాగస్వామ్యంతోనే విజయం

వర్షపు నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన ఇంటి వద్ద, అపార్ట్‌మెంట్‌లో లేదా కాలనీలో ఈ విధానాన్ని అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. “జల సంచయ్” కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించడంతో పాటు హైదరాబాద్‌ను మరింత సుస్థిర నగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.