ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 11:42 pm Posted by : Shiva Kumar BS

పోలీసులకు ఫైనాన్షియల్ లిటరసీపై అవగాహన సదస్సు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బందికి ఫైనాన్షియల్ లిటరసీ ప్రాధాన్యతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక అవగాహన నిపుణుడు కౌశిక్ మారిడి ముఖ్య వక్తగా హాజరై పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ డివిజన్ సహాయ పోలీసు కమిషనర్ (ఏసీపీ) ఎ.సి. బాల గంగిరెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌశిక్ మారిడి మాట్లాడుతూ, దేశంలో సాధారణ అక్షరాస్యత పెరుగుతున్నప్పటికీ ఆర్థిక అక్షరాస్యత విషయంలో ఇంకా ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని పేర్కొన్నారు.

ప్రతి వ్యక్తి తన ఆర్థిక భవిష్యత్తును సమర్థవంతంగా ప్రణాళిక చేసుకునేందుకు, పొదుపు, బీమా వంటి అంశాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఫైనాన్షియల్ లిటరసీ ఎంతో అవసరమని ఆయన వివరించారు. ఆర్థిక అవగాహన పెంపొందించడం ద్వారా ప్రజలు మరింత ఆర్థిక భద్రతను సాధించగలరని అభిప్రాయపడ్డారు.ఈ అవకాశాన్ని కల్పించిన సైబరాబాద్ పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన కౌశిక్ మారిడి, విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తున్న పోలీసు అధికారులతో మమేకం కావడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి పౌరుడు ఆర్థికంగా చైతన్యవంతుడు, భద్రత కలిగిన వ్యక్తిగా ఎదగాలనే లక్ష్యంతో తాను పని చేస్తున్నట్లు చెప్పారు.

కాగా, ఈ అవగాహన సదస్సు పూర్తిగా ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించే విద్యాపరమైన కార్యక్రమమేనని, ఇందులో వ్యక్తిగత పెట్టుబడి సలహాలు, నిర్దిష్ట ఆర్థిక ఉత్పత్తులు లేదా పెట్టుబడుల కొనుగోలు, విక్రయాలపై ఎలాంటి సూచనలు ఇవ్వలేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.