వికారాబాద్: పట్టణంలోని 30వ వార్డులో ప్రజల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు వార్డు కౌన్సిలర్ కాకి విజయలక్ష్మి నాగరాజు తెలిపారు. గత కొంతకాలంగా వార్డులో తగినంత వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన కౌన్సిలర్ వెంటనే స్పందించి మున్సిపల్ నిధులతో కొత్త ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ కాకి విజయలక్ష్మి నాగరాజు మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. “ప్రజల భద్రతే మా ప్రాధాన్యం… అభివృద్ధే మా లక్ష్యం” అని పేర్కొన్నారు. నూతన వీధి దీపాల ఏర్పాటుతో రాత్రి వేళల్లో ప్రయాణికులకు, స్థానికులకు మెరుగైన వెలుతురు అందుబాటులోకి రావడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.