- ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ అరెస్ట్
- ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను
- వెంటనే విడుదల చేయాలి డిమాండ్
- సర్టిఫికెట్ల కోసం ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి మండిపాటు
ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సచివాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మరియు తోపులాట జరిగింది. విద్యార్థుల పక్షాన న్యాయబద్ధంగా పోరాడుతున్న ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ పలువురు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు.

పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య అనేది విద్యార్థుల హక్కు అని, అది వ్యాపారం కాదని వారు నినదించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు విడుదల కాలేదనే సాకు చూపిస్తూ, సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల వద్ద యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని.. అలాంటి కళాశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.