- సాయిబాబా కాలనీ అభివృద్ధే లక్ష్యం ఐక్యతతో ముందుకు సాగుదాం
- అధ్యక్షుడు జె. శ్రీనివాసులు
ఆదాబ్ సైబరాబాద్, షాద్నగర్ : షాద్నగర్ పట్టణంలోని 6వ వార్డు పరిధిలో గల సాయిబాబా కాలనీలో బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా 6వ వార్డు కౌన్సిలర్ డి. రాజు నాయక్ హాజరుకాగా, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి కాలనీ అభివృద్ధి కమిటీ నూతన అధ్యక్షుడు జె. శ్రీనివాసులు మాట్లాడుతూ, “సాయిబాబా కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరం. బోనాల పండుగను భక్తి, శ్రద్ధలతో పాటు ఐక్యతకు ప్రతీకగా నిర్వహిద్దాం. యువత, మహిళలు, పెద్దలు అందరూ బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలి. కాలనీ పరిశుభ్రత, భద్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నిర్వహించుకుందాం. కాలనీ అభివృద్ధి కోసం అందరి సూచనలు స్వాగతించబడతాయి” అని అన్నారు.ముఖ్య అతిథి కౌన్సిలర్ డి. రాజు నాయక్ మాట్లాడుతూ, కాలనీ అభివృద్ధికి ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బోనాల ఉత్సవాలు శాంతియుతంగా, వైభవంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి కిరణ్ కుమార్, కోశాధికారి రాజేష్, గౌరవ అధ్యక్షుడు మంగ శంకర్ ( ఏ ఎస్ ఎస్ జి), 26వ వార్డ్ కౌన్సిలర్ శివ (ఎస్ పి), ముఖ్య సలహాదారు పినపాక ప్రభాకర్, సమన్వయకర్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు, కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమావేశంలో బోనాల ఉత్సవాల నిర్వహణ, ఆలయ అలంకరణ, భక్తులకు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
“కాలనీ అభివృద్ధి – ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం” అనే సందేశంతో సమావేశం విజయవంతంగా ముగిసింది.