రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. డిశ్చార్జ్ అనంతరం నేరుగా హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకోనున్నారు. మరో మూడు వారాల తర్వాత నుంచి ఫిజియోథెరపీ ప్రారంభించాలని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స చేసిన భుజం పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి సుమారు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్య బృందం వెల్లడించింది.