Date of Publish : 24 July 2026, 10:54 amPosted by : N Sandeep
షాపూర్ నగర్లో రూ.18 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన.. కుత్బుల్లాపూర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 291 షాపూర్ నగర్ డివిజన్లో రూ.18 లక్షల వ్యయంతో చేపట్టనున్న షాపూర్ మార్కెట్ నుంచి పోస్ట్ ఆఫీస్ రోడ్డు వరకు నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు.ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రహదారులు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. షాపూర్ నగర్లో నిర్మించనున్న సీసీ రోడ్డు పూర్తయిన అనంతరం స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగిల్ల శ్రీనివాస్, చౌడ శ్రీనివాస్, కూన రాఘవేందర్ గౌడ్, బిల్లా శ్యామ్, శంకర్ రెడ్డి, సంపత్ గౌడ్, మల్లారెడ్డి, హెచ్ఎంటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.