ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 9:51 am Posted by : Shiva Kumar BS

ఎల్లమ్మబండలో మంచినీటి కష్టాలు.. ప్రజల ఆగ్రహం!

మోటార్లు పెడితేనే నల్లాల్లో నీరు.. తారకరామా నగర్‌లో తీవ్ర ఇబ్బందులు

శేరిలింగంపల్లి : కూకట్‌పల్లి పరిధిలోని ఎల్లమ్మబండ ప్రాంతంలో మంచినీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. పేరుకే రిజర్వాయర్ ఉన్నప్పటికీ స్థానికులకు చుక్క నీరు కూడా సక్రమంగా అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటార్లు ఏర్పాటు చేసుకుంటే తప్ప నల్లాల్లో నీరు రాని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా తారకరామా నగర్‌లో ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఎల్లమ్మబండ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రతిరోజూ వేల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తున్నప్పటికీ, అదే ప్రాంత ప్రజలకు మాత్రం సరిపడా నీరు అందకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం కనిపించలేదని స్థానికులు వాపోతున్నారు. ఎల్లమ్మబండలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నప్పటికీ ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రజాప్రతినిధులు మాత్రం సైలెంట్ మోడ్‌లో ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తక్షణమే అధికారులు స్పందించి ఎల్లమ్మబండ, తారకరామా నగర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాను మెరుగుపరచాలని, ప్రజల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.