ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 3:05 pm Posted by : N Sandeep

శంషిగూడలో ప్రభుత్వ స్థలంపై కబ్జా ఆరోపణలు.. అధికారుల చర్యలపై స్థానికుల ప్రశ్నలు

శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగూడ గ్రామం సర్వే నెం. 57లో ప్రభుత్వ భూమిపై కబ్జా జరిగిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.స్థానికుల కథనం ప్రకారం, సీఎంసీ సర్కిల్-51లో శానిటరీ విభాగంలో పనిచేస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తి, ఎన్టీఆర్ నగర్‌కు సంబంధించిన బాంబే స్కీమ్ కింద ఉన్న ప్రభుత్వ స్థలంలో సుమారు 100 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించి, అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.అంతేకాకుండా, తనకు రాజకీయ నాయకులు, అధికారులు అండగా ఉన్నారనే ధైర్యంతో వ్యవహరిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి విద్యుత్, నీటి కనెక్షన్లు కూడా పొందినట్లు వారు పేర్కొంటున్నారు.2021 ఫిబ్రవరి 26 తేదీన వి. అనిత (భర్త: వి. భిక్షం) పేరుతో నకిలీ పత్రాలు సృష్టించారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా ఎమ్మార్వో, వీఆర్వోలు ఈ వ్యవహారంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే చర్యలు ఆలస్యం అవుతున్నాయా అనే అనుమానాలను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వార్తలో పేర్కొన్న అంశాలు స్థానికులు చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడ్డాయి. సంబంధిత వ్యక్తులు లేదా అధికారులు ఈ ఆరోపణలపై తమ స్పందన తెలియజేయాల్సి ఉంది.