ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 3:04 pm Posted by : N Sandeep

హైడ్రా కొనసాగాలి – చెరువులను కాపాడాలి: తుమ్మిడ్కుంట సరస్సు వద్ద అవగాహన ర్యాలీ

మాదాపూర్ డివిజన్ హైటెక్ సిటీ పరిధిలోని తుమ్మిడ్కుంట సరస్సు వద్ద నేడు “హైడ్రా ఉండాలి – చెరువులు కాపాడాలి” అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మద్దతుగా తెలంగాణ ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సోసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్ గౌడ్, ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్వారీ శశిధర్ తదితరులు నియోజకవర్గ నాయకులతో కలిసి పాల్గొన్నారు.ర్యాలీ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చెరువులు, కుంటలు మరియు ఇతర జలవనరులు ప్రజల జీవనాధారమని, వాటిని ఆక్రమణల నుంచి రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. అక్రమ ఆక్రమణలను అరికట్టి ప్రభుత్వ భూములు, జలవనరులను పరిరక్షించడంలో హైడ్రా వంటి వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయాలని కోరారు.చెరువులు ఉంటేనే భవిష్యత్ ఉంటుంది అని పేర్కొంటూ, ప్రభుత్వం చెరువుల ఆక్రమణలను కఠినంగా అరికట్టి, హైడ్రా వ్యవస్థను మరింత బలోపేతం చేసి చెరువుల సంరక్షణకు సమర్థమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చెరువుల పరిరక్షణ రాజకీయ అంశం కాదని, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు.పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చెరువుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, హైడ్రా వ్యవస్థ కొనసాగుతూ జలవనరుల రక్షణలో కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ అవగాహన ర్యాలీలో సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు, కాలనీవాసులు మరియు టీం పట్వారీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని చెరువుల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.