ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో చార్ ధామ్ యాత్ర మార్గాలు పలు చోట్ల మూసుకుపోయాయి. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్ ధామ్ యాత్రను బుధవారం వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన వెంటనే యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు. భారీ వర్షాలతో ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, జాతీయ, గ్రామీణ రహదారులపై రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విపత్తు నిర్వహణ బృందాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరోవైపు, పలు జిల్లాల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించింది.
