ప్రవేశ పరీక్ష ఈనెల 12న
ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో ఎంపికైన మూడు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ) కేంద్రాల్లో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 12న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.డి. అబ్దుల్ ఘని తెలిపారు. జిల్లాలోని కేజీబీవీ వికారాబాద్, కేజీబీవీ దోమ, కేజీబీవీ కోడంగల్ కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రవేశం పొందిన విద్యార్థులకు 6వ తరగతి నుంచే జేఈఈ (JEE), నీట్ (NEET), క్లాట్ (CLAT) వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు హాస్టల్ వసతి, ఎస్ఓపీ ప్రమాణాల ప్రకారం పోషకాహారం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, యూనిఫామ్లు, దుప్పట్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
అదనంగా యోగ, కరాటే, క్రీడలు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా ద్వారా డిజిటల్ లెర్నింగ్, కంప్యూటర్ విద్య, టైలరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉంటాయని డీఈఓ తెలిపారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత కేజీబీవీ కేంద్రాల స్పెషల్ అధికారులను సంప్రదించాలని జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు.
