స్నేహితుడి సహకారంతో దందా
ఆదాబ్ సైబరాబాద్, మేడ్చెల్ :
ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ఓ యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశాకు చెందిన అలోక్ సర్దార్ (20) ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చాడు. ఈ క్రమంలో మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుడు తన స్నేహితుడి సహకారంతో ఒడిశా నుంచి సుమారు 2 కిలోల గంజాయిని తీసుకొచ్చి, హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు సమాచారం మేరకు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి 2 కిలోల గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడికి గంజాయి సరఫరా చేసిన వ్యక్తులు, కొనుగోలు దారుల వివరాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
