రూ.70 లక్షల విలువైన ఆర్ఆర్యూల స్వాధీనం
న్యూఢిల్లీ : మొబైల్ టవర్లలో వైర్లెస్ ట్రాన్స్మిషన్ కోసం ఉపయోగించే కీలకమైన రిమోట్ రేడియో యూనిట్ పరికరాలను చోరీ చేసి విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఛేదించింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో నిందితులు చోరీ చేసిన ఆర్ఆర్యూ పరికరాలను నకిలీ పత్రాల సహాయంతో హాంకాంగ్కు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు.
సాంకేతిక నిఘా, సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి సుమారు రూ.70 లక్షల విలువైన 43 చోరీకి గురైన ఆర్ఆర్యూ పరికరాలు, ఒక కారు, ఒక డీ-వ్యాన్, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠాకు సంబంధించి మరిన్ని వివరాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న అనుబంధాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
