ఆదాబ్ సైబరాబాద్, శంకర్ పల్లి :- రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిధి లోని మొకిలా పోలీస్ స్టేషన్ ప్రాంతం లో ఇందిరా రెడ్డి నగర్ ఫేజ్-2 ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఏసీపీ కిషన్ ఆధ్వర్యంలో మొకిలా పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానిత వ్యక్తులు మరియు అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచే లక్ష్యంతో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాంతంలోని ఇళ్లు, వీధులు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను పోలీసులు గుర్తించి సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సంబంధిత వాహన యజమానులు అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాతే వాహనాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ కిషన్ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు వాహన రిజిస్ట్రేషన్, బీమా, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థంగా అరికట్టడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
