ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా, ఆమె ప్రతి ఫిర్యాదును వ్యక్తిగతంగా పరిశీలించారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ, సంబంధిత అంశాలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి, చట్టపరమైన పరిధిలో త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ అంశాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన ఆమె, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అవసరమైన సందర్భాల్లో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు పోలీసు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎస్పీ స్నేహ మెహ్రా హామీ ఇచ్చారు.
