కుత్బుల్లాపూర్ : సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ అలాగే కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం గాజులరామారం సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ రోడ్డుపై ఉన్న రహదారి ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ను సాఫీగా నిర్వహించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలు, ఇతర అడ్డంకులను అధికారులు తొలగించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) ఆర్. సుమిత్ర, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (టీపీఎస్) బి. సరిత సేన్ తమ సిబ్బందితో కలిసి పాల్గొని ఆక్రమణల తొలగింపు పనులను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజా రహదారులను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, రోడ్లను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
