- పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..
- పలువురిపై పలు సెక్షన్ల కింద చర్యలు
ఆదాబ్ సైబరాబాద్, మేడ్చల్ జిల్లా : పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ ఆక్రమణ, అక్రమ ప్రవేశం, ఆస్తుల ధ్వంసం, దాడి ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఎస్.భగారాం 2006లో కుత్బుల్లాపూర్ మండలం సుభాష్నగర్ సర్వే నంబర్లు 313/205 (1200 చదరపు గజాలు), 314 (716 చదరపు గజాలు), 316 (524 చదరపు గజాలు)లో భూములను తన కుమారుడి పేరుతో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

ఆ స్థలంలో 2007లో రెండు గదులు నిర్మించి, వాటిని అద్దెకు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం 2016లో సూర్య భగవాన్కు అద్దెకు ఇచ్చి, బోర్వెల్ త్రవ్వించి విద్యుత్ కనెక్షన్ కూడా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే గత రెండు నెలలుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అనుచరుడు పుప్పాల భాస్కర్, విష్ణు కుమార్ తదితరులు తమ భూమిలోకి వచ్చి, ఆ స్థలం ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి చెందినదని చెబుతూ హెచ్చరించారని ఆరోపించారు. అలాగే జూలై 12 అర్ధరాత్రి సుమారు 3 గంటల సమయంలో 20 నుంచి 25 మంది వ్యక్తులు వాహనాల్లో వచ్చి సెక్యూరిటీ గది తాళాలు పగులగొట్టి, అక్కడ ఉన్న ఇద్దరిపై దాడి చేశారని, జేసీబీ సహాయంతో నాలుగు గదులు, పశువుల షెడ్ను కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్లు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పేట్బషీరాబాద్ పోలీసులు క్రైం నంబర్ 994/2026గా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 329(3), 324(4), 352 3(5) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తును ఎస్ఐ ఈ శ్రీనివాస్కు అప్పగించారు.
