ఎమ్మెల్యే వివేకానంద హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి
ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వేలాది మంది విశ్వకర్మలు నివసిస్తున్నప్పటికీ వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని తెలంగాణ ప్రభుత్వ టూరిజం, సాంస్కృతిక శాఖ సలహాదారు దరువు అంజన్న అన్నారు. విశ్వకర్మలకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ నిర్మించి, వారి అవసరాలకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు.
సూరారంలోని విశ్వకర్మ కాలనీలో నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దరువు అంజన్న ఈ సందర్భంగా మాట్లాడారు. రాజకీయ పార్టీలు విశ్వకర్మల ఓట్లను మాత్రమే ఆశిస్తున్నాయని, అయితే వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
గతంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద జగద్గిరిగుట్ట ప్రాంతంలో విశ్వకర్మలకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని, కైసర్నగర్ ప్రాంతంలో స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ హామీలు ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు.
ఇప్పటికైనా విశ్వకర్మలను చిన్నచూపు చూడకుండా వారికి స్థలం కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. విశ్వకర్మల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక అవసరమని అన్నారు.
అనంతరం శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పొలిగారం కృష్ణమాచారి, ప్రెసిడెంట్ కమ్మరి లక్ష్మణాచారి, ఎస్ఆర్ నాయక్నగర్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఆలూరి శేషాచారి తదితరులు పాల్గొన్నారు.
