కుత్బుల్లాపూర్ : చింతల్ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో బీకేఆర్ (బొంగుణూరి కిషోర్ రెడ్డి) ఫౌండేషన్ ఆధ్వర్యంలో 48వ ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ కమిటీ వైస్ చైర్మన్ బొంగుణూరి కిషోర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండీ ఫలాహ్ ఉర్ రహమాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ ఫలాహ్ ఉర్ రహమాన్ మాట్లాడుతూ, కుత్బుల్లాపూర్ ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి పేదలకు వైద్య సేవలు అందించడం ఎంతో ప్రశంసనీయమైన కార్యక్రమమని అన్నారు. సమాజ సేవకు అంకితభావంతో పనిచేసే యువ నాయకులకు, ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే వారికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
బొంగుణూరి కిషోర్ రెడ్డి ప్రజా సేవలో భాగంగా వేసవిలో ఉచిత మంచినీటి పంపిణీ, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణతో పాటు మహిళా సాధికారత కోసం కుట్టు మిషన్ల పంపిణీ, ప్లేట్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే ఇలాంటి కార్యక్రమాలు సమాజాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.ఈ వైద్య శిబిరంలో స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బహదూర్పల్లి సీనియర్ నాయకుడు సాధు యాదవ్, రాష్ట్ర ఎన్ఎస్యూఐ నాయకుడు పృథ్వీ, యూత్ కాంగ్రెస్ నాయకుడు బిల్లా, చింతల్ మహిళా అధ్యక్షురాలు కమలా, నాగమణి, స్వప్న, సరిత, జగన్, ప్రశాంత్ రెడ్డి, పృథ్వీ మిత్రబృందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
