డీసీపీ రాహుల్ రెడ్డి ఐపీఎస్ చొరవతో జవహర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హెల్త్ క్యాంప్
కీసర : ఎండ, వర్షం అనక ట్రాఫిక్తో నిరంతరం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డీసీపీ (ట్రాఫిక్, జోన్-1) రాహుల్ రెడ్డి చొరవతో, ‘రెటినోవా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్, ఐ ప్లానెట్ ఆప్టిక్స్, పద్మ సాయి డెంటల్, స్కై ఫీట్ ఫిజియోథెరపీల సహకారంతో కమిషనరేట్ పరిధిలోని 11 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

బేగంపేట, తిరుమలగిరి, అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో విజయవంతంగా పూర్తయిన అనంతరం, నేడు జవహర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో జవహర్నగర్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది దాదాపు 50 మంది పాల్గొన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఫిజియోథెరపీతో పాటు రక్తపోటు, ECG, రక్తంలో చక్కెర స్థాయిల పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. వైద్యులు సిబ్బందికి జీవనశైలి, ఆహార నియమాలపై సూచనలు చేశారు.

ఈ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి ట్రాఫిక్ ఎసిపి సుబ్బయ్య పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై చూపిస్తున్న చొరవను సిబ్బంది అభినందించారు.జవహర్ నగర్ ట్రాఫిక్ సిఐ కె. శివశంకర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
