రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్
పెద్దపల్లి : పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న కల్లెపల్లి సతీష్ కుమార్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు.
ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం, టెనుగువాడ హిందూ శ్మశానవాటిక, కునారం రోడ్డులోని శ్మశానవాటిక అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.12,28,748 విలువైన తుది బిల్లును ప్రాసెస్ చేసి, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TUFIDC)కు పంపించేందుకు అధికారిక అనుకూలం కల్పిస్తానంటూ కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు మంగళవారం నిందితుడి నివాసంలో ఉచ్చుపన్ని, రూ.2 లక్షల లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని నిందితుడి సూచన మేరకు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిర్వహించిన ఇంటి సోదాల్లో లెక్కల్లో చూపని రూ.32,31,900 నగదు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కరీంనగర్లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు 1064 టోల్ఫ్రీ నంబర్, వాట్సాప్ 9440446106 లేదా తెలంగాణ ఏసీబీ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది.
