200 ఐఎస్ఐ హెల్మెట్ల పంపిణీ
హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ జోన్ ఏసీపీ కె. హరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జంక్షన్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తారక్ ట్రస్ట్ సహకారంతో ద్విచక్ర వాహనదారులు, వెనుక కూర్చునే ప్రయాణికులకు 200 ఐఎస్ఐ ప్రమాణాల హెల్మెట్లను పంపిణీ చేశారు.
అలాగే వాహనదారులకు రాంగ్సైడ్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగం, మైనర్లతో వాహనాలు నడిపించడం వంటి ప్రమాదకర చర్యల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
రోడ్డు నిబంధనలు పాటించడం, తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలను తగ్గించి హైదరాబాద్ రహదారులను మరింత సురక్షితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు పిలుపునిచ్చారు.
