ఆదాబ్ సైబరాబాద్, ఆంద్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని (నేషనల్ వార్ మెమోరియల్) సందర్శించి దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనిక వీరులకు ఘనంగా నివాళులర్పించారు.
‘సేనా ప్రస్థానం – దేశ సమగ్రత కోసం’ కార్యక్రమంలో భాగంగా జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్, అక్కడి డిజిటల్ విజిటర్స్ బుక్లో తన సందేశాన్ని నమోదు చేశారు. భారత సాయుధ దళాల కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల త్యాగస్ఫూర్తికి నమస్కరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
స్మారక స్థలంలో చెక్కబడిన ప్రతి పేరు అసాధారణ ధైర్యసాహసాలకు, నిస్వార్థ సేవాభావానికి, దేశభక్తికి ప్రతీక అని పవన్ కళ్యాణ్ తన సందేశంలో తెలిపారు. వీర సైనికుల త్యాగాల వల్లే దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత పరిరక్షించబడ్డాయని పేర్కొన్నారు.
ఈ పవిత్ర స్మారక స్థలం వద్ద నిలబడినప్పుడు దేశం కోసం తమను తాము అంకితం చేసుకున్న అమరవీరుల స్ఫూర్తి గుర్తుకు వస్తుందని, వారి త్యాగం దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. అమర వీరుల వారసత్వం నుంచి స్ఫూర్తి పొంది బలమైన, సురక్షితమైన, ఐక్య భారత నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జాతీయ యుద్ధ స్మారక సందర్శనకు గుర్తుగా పవన్ కళ్యాణ్ డిజిటల్ విజిటర్స్ బుక్పై సంతకం చేశారు.
