ఆదాబ్ సైబరాబాద్, విశాఖపట్నం: విద్యార్థినుల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు విశాఖ నగర పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల నివారణ అంశాలపై పాఠశాల విద్యార్థినులకు సమగ్రంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శక్తి యాప్ డౌన్లోడ్ విధానం, దాని ఉపయోగాలు, మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పోలీసులు వివరించారు. అలాగే సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచిత వ్యక్తులతో పరిచయాల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, ఫోటో మార్ఫింగ్ ద్వారా జరిగే బ్లాక్మెయిలింగ్, ఫేక్ ఫోన్ కాల్స్, ఓటీపీ మోసాలు, ఏటీఎం మోసాలు వంటి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థినులకు డ్రగ్స్ దుష్ప్రభావాలు, పోక్సో చట్టం నిబంధనలు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన 112, 1098, 181, 1930 వంటి హెల్ప్లైన్ నంబర్ల గురించి వివరించారు. అదనంగా స్వీయ రక్షణ పద్ధతులు, శక్తి యాప్లో అందుబాటులో ఉన్న నైట్ షెల్టర్ వంటి భద్రతా ఫీచర్ల వినియోగంపై కూడా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో భద్రతా చైతన్యం పెంపొందించడంతో పాటు, తమ రక్షణకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు.
