e-Paper
Sunday, September 13, 2026
Homeతెలంగాణవికారాబాద్ప్రజల విశ్వాసమే పోలీసుల అసలైన బలం : పరిగి పోలీస్ స్టేషన్ తనిఖీలో ఐజీపీ షహనవాజ్...

ప్రజల విశ్వాసమే పోలీసుల అసలైన బలం : పరిగి పోలీస్ స్టేషన్ తనిఖీలో ఐజీపీ షహనవాజ్ ఖాసిం

📰 Generate e-Paper Clip

  • వార్షిక తనిఖీలో పోలీసుల పనితీరు, క్రమశిక్షణ, రికార్డుల నిర్వహణపై సమగ్ర సమీక్ష
  • సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, పెండింగ్ కేసుల పరిష్కారంపై కీలక ఆదేశాలు
  • ‘వికారాబాద్ రక్షణ నేత్రం’ సీసీటీవీ వ్యవస్థను ప్రశంసించిన ఐజీపీ.. కమ్యూనిటీ పోలీసింగ్ బలోపేతానికి పిలుపు
  • పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన ఐజీపీ

వికారాబాద్ జిల్లా : వార్షిక తనిఖీలలో భాగంగా మల్టీ జోన్–II గౌరవ ఐజీపీ షహనవాజ్ ఖాసీం సోమవారం పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీమతి స్నేహ మెహ్రా ఐజీపీ కి బొకే అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించిన ఐజీపీ పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తనిఖీలో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది టర్న్‌అవుట్, క్రమశిక్షణ, విధి నిర్వహణ తీరు, ప్రజల పట్ల వ్యవహరించే విధానం, కార్యాచరణ సామర్థ్యాన్ని సమగ్రంగా పరిశీలించారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారు నిర్వహిస్తున్న విధులు, ప్రజలకు అందిస్తున్న సేవలు, సాధించిన విజయాలు, ఎదురవుతున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఐజీపీ, “వికారాబాద్ రక్షణ నేత్రం” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరు, ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థ, నేరాల నియంత్రణలో వాటి వినియోగాన్ని పరిశీలించి పోలీసుల పనితీరును ప్రశంసించారు.

పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసు ఫైళ్లు, స్టేషన్ డైరీలు, వివిధ రిజిస్టర్లు, మాల్ఖానా నిర్వహణ, రిసెప్షన్, లాక్‌అప్, కంప్యూటర్ విభాగం, మహిళా సహాయ కేంద్రం, సీసీటీఎన్‌ఎస్ నిర్వహణ, డిజిటల్ రికార్డుల నిర్వహణ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. కేసుల దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచాలని, పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని, ప్రతి కేసులో నాణ్యమైన సాక్ష్యాధారాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, రికార్డుల నిర్వహణలో నిర్దేశిత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఐజీపీ మాట్లాడుతూ, “ప్రతి పోలీస్ అధికారి తనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి నిరంతరం అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలి. సరైన అలవాట్లు, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, సేవా దృక్పథం ప్రతి పోలీస్‌కు అత్యంత అవసరం. ప్రజలకు న్యాయం చేయడం, వారి విశ్వాసాన్ని నిలబెట్టడం ప్రతి పోలీస్ బాధ్యత” అని అన్నారు. అదేవిధంగా సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, ఎన్డిపిఎస్ చట్టం కింద మాదకద్రవ్యాల నిర్మూలనకు మరింత కఠిన చర్యలు కొనసాగించాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, ప్రమాదం జరిగిన వెంటనే స్పందిస్తూ గోల్డెన్ అవర్ సమయంలో బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా పోలీస్ అధికారులు వేగంగా స్పందించాలని, ప్రతి ప్రాణం విలువైనదనే భావనతో పనిచేయాలని సూచించారు. ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా మెలుగుతూ కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని, గ్రామస్థాయిలో ప్రజలతో సమన్వయాన్ని పెంపొందించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం, నిఘా వ్యవస్థలు, సీసీటీవీ నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పరిగి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఐజీపీ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ అధికారి విధి నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా పరిగి డీఎస్పీ శ్రీనివాస్, పరిగి సీఐ కొండల్ రెడ్డి, పరిగి ఎస్‌ఐ మోహన కృష్ణ , ఇతర పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!