e-Paper
Saturday, September 12, 2026
Homeఇంటర్నేషనల్బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ - హైదరాబాద్‌లో సమావేశం

బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ – హైదరాబాద్‌లో సమావేశం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆగస్టు 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశం కొనసాగనుంది. సమావేశంతో పాటు ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ రెండో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు.

ప్రారంభ కార్యక్రమానికి భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సుస్థిరమైన మరియు సమ్మిళిత అభివృద్ధికి అవినీతి పెద్ద అడ్డంకి అని పేర్కొన్నారు. అవినీతి వల్ల ఆసుపత్రులు, పాఠశాలలు, మౌలిక వసతుల కోసం వినియోగించాల్సిన ప్రజా వనరులు దారి మళ్లిపోతాయని, ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని అన్నారు.

“అవినీతి అనే సవాలు ఏ ఒక్క దేశానికీ పరిమితం కాదు. దాన్ని ఏ దేశమూ ఒంటరిగా ఎదుర్కోలేదు. అక్రమ ఆర్థిక మళ్లింపులను అడ్డుకోవడానికి, ప్రజా వనరులను రక్షించడానికి, అంతర్జాతీయ అవినీతి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సమష్టి అంతర్జాతీయ సహకారం అవసరం” అని రచనా షా స్పష్టం చేశారు.

సీమాంతర అవినీతిని ఎదుర్కోవడంలో బ్రిక్స్ దేశాలు ఆచరణాత్మక సహకారం, స్పష్టమైన ఫలితాల దిశగా కదలాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాలుగా మారుతున్నారని పేర్కొన్నారు. నేరాల ద్వారా సంపాదించిన వ్యక్తులకు ఏ దేశమూ ఆశ్రయంగా మారకూడదని ఆమె హెచ్చరించారు.

పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించడం, వారి అప్పగింతకు సహకరించడం, దొంగిలించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, అక్రమ నిధులు సరిహద్దులు దాటి తరలిపోవడానికి కారణమవుతున్న లోపాలను తొలగించడంలో బ్రిక్స్ దేశాల మధ్య మరింత బలమైన సహకారం అవసరమని ఆమె అన్నారు.

అవినీతి కేసుల్లో పరారీలో ఉన్న నిందితుల అప్పగింతకు మద్దతుగా ఏర్పాటైన బ్రిక్స్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాక్టీషనర్ల నెట్‌వర్క్ పై జరుగుతున్న చర్చలను రచనా షా స్వాగతించారు. అలాగే ఆస్తుల రికవరీ కోసం రూపొందించిన ప్రామాణిక సమాచార టెంప్లేట్, స్థానిక నోడల్ పాయింట్లు, నిపుణుల డైరెక్టరీ చట్ట అమలు సంస్థల మధ్య వేగవంతమైన మరియు ప్రభావవంతమైన సమాచార మార్పిడికి దోహదపడతాయని తెలిపారు.

సాంకేతికత ఆధారిత పరిపాలనపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు. డిజిటల్ గుర్తింపు, ఈ-సేవలు, డిజిటల్ చెల్లింపులు, పారదర్శక కొనుగోలు వ్యవస్థలు అవినీతి అవకాశాలను తగ్గించగలవని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్ , ప్రత్యక్ష నగదు బదిలీ  కార్యక్రమాలను సాంకేతిక సంస్కరణలకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.

పన్నులు మరియు ఇతర ప్రభుత్వ సేవల్లో ముఖరహిత, కాగితరహిత విధానాలు, డేటా ఆధారిత పర్యవేక్షణ, సాంకేతిక నిఘా, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు అవినీతి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

‘నవకల్పనలు, సాంకేతికత ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పరిపాలన’ అంశంపై నిర్వహించే సమాంతర కార్యక్రమం ద్వారా సభ్య దేశాలు తమ అనుభవాలు, విజిలెన్స్ పద్ధతులు, సాంకేతిక పరిష్కారాలు, నివారణాత్మక పర్యవేక్షణ విధానాలను పరస్పరం పంచుకునే అవకాశం లభిస్తుందని రచనా షా తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!