ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న నరేష్ ప్రజాపతి
ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఉద్యమకారుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఉద్యమకారుల ఇన్చార్జ్ నరేష్ ప్రజాపతి హెచ్చరించారు.
జూలై 2న ఉప్పల్ బాగాయత్లో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఉద్యమకారులు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ, ఉద్యమకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ తెలంగాణ ఉద్యమకారులను విస్మరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తక్కువ అంచనా వేస్తున్న ప్రభుత్వానికి భూ పోరాటం ద్వారా గట్టి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

మరో మిలియన్ మార్చ్ను తలపించేలా ఉప్పల్ బాగాయత్లో జరగనున్న భూ పోరాటాన్ని విజయవంతం చేసి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని, అమరవీరుల ఆశయాలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు.
జీహెచ్ఎంసీ తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం కార్యక్రమం ఇన్చార్జ్ నరేష్ ప్రజాపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ బాధ్యులు ఎత్తారి మారయ్య, పడాల మనోజ్ గౌడ్ పాల్గొని ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు మల్లూరి అనిల్ కుమార్, రామగిరి ప్రకాష్, బీరకాయల మధుసూదన్, రాజలింగం, సంధ్యారెడ్డి, శీలం వీరేందర్, సీతారాం, నవీన్, రామ్కోటి, కొప్పుల అర్జున్, బెంజమిన్, శ్రీనివాస్ యాదవ్, సోనీదేవి, రాజు, సమీర్ తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.
