మహిళల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం : బండి రమేష్
ఆదాబ్ సైబరాబాద్, కూకట్పల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి కానుక – ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం కేపీహెచ్బీ కాలనీలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి రమేష్ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గంలో సుమారు 70 వేల మంది మహిళలకు ముఖ్యమంత్రి కానుకగా ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, పిడికిటి గోపాల్ చౌదరి, కిలారు శ్రీనివాస్, రంగమోహన్, రజిత, కల్పన, వాణి, సుజాత, వనజ, జ్యోతి, రజిని, మైఖేల్, బాబ్జి, రమణ, వాసు, బొచ్చు మల్లి, తమ్మినేని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
