హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ – ప్రేమ్ నగర్ బి బ్లాక్ మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో నూతన నాలా పైప్లైన్ పనుల సందర్భంగా భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగిన ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ప్రేమ్ నగర్ బి బ్లాక్కు చెందిన బాలయ్య (70) అనే వృద్ధుడు తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటన నేపథ్యంలో రవికుమార్ యాదవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ప్రభుత్వం మరియు సంబంధిత సిఎంసి అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించడంతో పాటు నాలా నిర్మాణ పనులను శాశ్వత పరిష్కారం దిశగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన గంటల తర్వాత కూడా బాధితుడి ఆచూకీ లభించకపోవడం తీవ్ర విచారకరమని అన్నారు. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అత్యవసర పనులు చేపట్టడం, కనీస భద్రతా సూచనలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా మ్యాన్హోల్ను తెరిచి ఉంచడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని విమర్శించారు.హఫీజ్పేట్ ప్రాంతం నుంచి మళ్లించిన నాలా కారణంగా ప్రేమ్ నగర్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, స్థానికులు విషజ్వరాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. పనులను పూర్తి చేయకుండా తాత్కాలికంగా వదిలేయడం ప్రజలకు మరింత ఇబ్బందులు కలిగిస్తోందని అన్నారు.ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించి, నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు నాలా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాజు, రామ్రెడ్డి, రెహమాన్, శంకర్, సత్య, విజయ్, మహేష్, ఏడుకొండలు, ఇస్మాయిల్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
