- నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్ ప్రియాంక అలా
హైదరాబాద్ : జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన అర్హులైన 21 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా గురువారం కలెక్టరేట్లో అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగాన్ని పవిత్రమైన బాధ్యతగా భావించి ప్రజలకు సేవ చేసే దృక్పథంతో విధులు నిర్వహించాలని నూతన ఉద్యోగులకు సూచించారు. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తే ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
కారుణ్య నియామకాల కింద రెవెన్యూ శాఖలో 17 మంది, గాంధీ ఆసుపత్రిలో ఒకరు, ఏసీబీ కార్యాలయంలో ఒకరు, ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఒకరు, ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఒకరికి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో నియామకాలు కల్పించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) వెంకట్రామిరెడ్డి, సంబంధిత సెక్షన్ సిబ్బంది, నియామకం పొందిన అభ్యర్థులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
