సైబరాబాద్లో భద్రత, సుస్థిర అభివృద్ధి కోసం పోలీస్–పరిశ్రమ–సమాజం మధ్య సమన్వయానికి వేదికగా నిలిచిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటి కౌన్సిల్ (SCSC) రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని అవాసా హోటల్లో ఎస్సీఎస్సీ 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘రెండు దశాబ్దాల విశ్వసనీయ భాగస్వామ్యం, భద్రత–అభివృద్ధి’ అనే థీమ్తో నిర్వహించిన కార్యక్రమానికి సీనియర్ పోలీసు అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, భద్రతా నిపుణులు, వైద్య రంగ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, కమ్యూనిటీ ప్రతినిధులు హాజరయ్యారు.
2006లో ప్రారంభమైన ప్రస్థానం
వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ ప్రాంతంలో భద్రత, సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీస్, పరిశ్రమ, సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2006 ఆగస్టు 23న ఎస్సీఎస్సీ అధికారికంగా ఏర్పాటైంది. అప్పటి నుంచి మారుతున్న సవాళ్లకు అనుగుణంగా సంస్థ తన కార్యకలాపాలను విస్తరించుకుంటూ వచ్చింది. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్, ఐపీఎస్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, విస్తృత ఐటీ కమ్యూనిటీ భద్రత సైబరాబాద్ పోలీసులకు అత్యంత ప్రాధాన్య అంశమని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా పోలీసులకు ఎస్సీఎస్సీ అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు. తెలంగాణ ఉద్యమం, కోవిడ్–19 మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పోలీస్, పరిశ్రమ, ఇతర భాగస్వాముల మధ్య సమన్వయం ద్వారా భద్రత, కార్యకలాపాలు, సామాజిక సవాళ్లను ఎదుర్కొన్నామని ఆయన గుర్తుచేశారు. కాలానుగుణంగా ఈ భాగస్వామ్యం సమస్యలకు ప్రతిస్పందించడం నుంచి ముందస్తుగా సవాళ్లను గుర్తించి ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించే స్థాయికి ఎదిగిందని కమిషనర్ పేర్కొన్నారు. సురక్షితమైన, విపత్తులను తట్టుకునే సామర్థ్యం కలిగిన సైబరాబాద్ నిర్మాణానికి పోలీస్, పరిశ్రమ, సమాజం మధ్య నిరంతర సహకారం అవసరమని అన్నారు.
ఎస్సీఎస్సీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న కృష్ణ యెదుల
ఎస్సీఎస్సీ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ కృష్ణ యెదుల సంస్థ ప్రారంభ దశలను, సైబరాబాద్ ఐటీ కారిడార్ అభివృద్ధిని గుర్తుచేసుకున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ రంగానికి సురక్షిత వాతావరణం అవసరమనే అంశంపై పోలీస్, పరిశ్రమ వర్గాల మధ్య జరిగిన చర్చల నుంచి ఎస్సీఎస్సీ ఆలోచన పుట్టుకొచ్చిందని తెలిపారు. పరిశ్రమ సమస్యలు, ప్రామాణిక నిర్వహణ విధానాల (SOPs)పై విస్తృతంగా చర్చలు, సంప్రదింపులు జరిపిన అనంతరం 2006 ఆగస్టు 23న సంస్థ రూపుదిద్దుకుందని వివరించారు. ప్రస్తుతం వివిధ రంగాలకు చెందిన భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకువచ్చే బలమైన సంస్థగా ఎస్సీఎస్సీ ఎదిగిందన్నారు.
లోగో, స్మారక పుస్తకం ఆవిష్కరణ
20వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎస్సీఎస్సీ @ 20 లోగోను ఆవిష్కరించారు. అలాగే సంస్థ రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని ప్రతిబింబించే ‘ఎనేబ్లింగ్ ఎంటర్ప్రైజ్ – 2 డికేడ్స్ ఆఫ్ ఎస్సీఎస్సీ’ అనే స్మారక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్సీఎస్సీ డైరెక్టర్–స్ట్రాటజిక్ రిలేషన్స్ నాన్సీ సాహు ప్రత్యేక కళా ప్రదర్శన నిర్వహించారు.
మహిళలు, పిల్లల భద్రతపై చర్చ
వార్షికోత్సవంలో సమకాలీన సవాళ్లపై నాలుగు ప్రత్యేక ప్యానెల్ చర్చలు నిర్వహించారు. ‘వాట్ డజ్ ఇట్ మీన్ టు ఫీల్ సేఫ్? – క్రియేటింగ్ సేఫర్ స్పేసెస్ ఫర్ విమెన్, చిల్డ్రన్ & ది నెక్స్ట్ జనరేషన్’ అనే అంశంపై జరిగిన తొలి చర్చకు ‘మన తెలంగాణ’ ఎడిటర్ దేవులపల్లి అమర్ మోడరేటర్గా వ్యవహరించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. శ్రీజన, ఐఏఎస్, సైబరాబాద్ డీసీపీ ట్రాఫిక్ శేషాద్రిణి రెడ్డి, ఎలికో హెల్త్కేర్ సర్వీసెస్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎస్సీఎస్సీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ వనిత దత్లా, లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ హెడ్–పీపుల్ పార్ట్నరింగ్ తనూజ అబ్బూరి పాల్గొన్నారు. మహిళలు, పిల్లల భద్రత, అవగాహన, సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించడం, భద్రతను జీవిత నైపుణ్యంగా మార్చుకోవాల్సిన అవసరంపై చర్చించారు.
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
‘హూ ఈజ్ సేఫ్ ఇన్ ఎ డిజిటల్ వరల్డ్? – స్ట్రెంగ్తెనింగ్ సైబర్ క్రైమ్ ప్రివెన్షన్, ఫిజికల్ & కమ్యూనిటీ రెసిలియన్స్’ అంశంపై రెండో ప్యానెల్ చర్చ జరిగింది. ‘తెలంగాణ టుడే’ ఎడిటర్ కె. శ్రీనివాస్ రెడ్డి మోడరేటర్గా వ్యవహరించారు. ఎస్వీపీఎన్పీఏ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కల్మేశ్వర్ షింగెనవర్, ఐపీఎస్, కూకట్పల్లి డీసీపీ రితి రాజ్, ఐపీఎస్, ఎస్సీఎస్సీ జాయింట్ సెక్రటరీ–సైబర్ సెక్యూరిటీ, సద్గురు మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ వ్యవస్థాపకుడు రఘు కన్నన్, ఎస్సీఎస్సీ ఈసీ సభ్యుడు, టీసీఎస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ నాగేశ్వర్ రావు చల్లా పాల్గొన్నారు. మారుతున్న సైబర్ నేరాల తీరు, డిజిటల్ ఆధారాల ప్రాధాన్యం, సైబర్ మోసాలపై అవగాహన, పోలీస్, టెక్నాలజీ నిపుణులు, సంస్థలు, ప్రజల మధ్య మరింత సమన్వయం అవసరంపై చర్చించారు.
రోడ్డు భద్రతపై దృష్టి
‘క్యాన్ వి ఛేంజ్ ది వే వి మూవ్? – బిల్డింగ్ సేఫర్ రోడ్స్ త్రూ పీపుల్, పార్ట్నర్షిప్ & టెక్నాలజీ’ అంశంపై మూడో ప్యానెల్ నిర్వహించారు. ‘ది హిందూ–తెలంగాణ’ డిప్యూటీ ఎడిటర్ మార్రి రాము మోడరేటర్గా వ్యవహరించారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ప్రీత్ సింగ్, ఐపీఎస్, ఎస్సీఎస్సీ ఈసీ సభ్యుడు, కె. రహేజా కార్పొరేషన్ సీఓఓ శర్వణ్ కుమార్ గోన్, టాప్డ్రైవర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్పీ వ్యవస్థాపకుడు నరేశ్ రాఘవన్, ప్రైడ్ మోటార్స్ ఆటోమొబైల్ డీలర్ వై. సురేశ్ రెడ్డి పాల్గొన్నారు. బాధ్యతాయుత డ్రైవింగ్, డ్రైవర్ శిక్షణ, ట్రాఫిక్ అమలు, మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు భద్రతను మెరుగుపరచడంపై చర్చించారు.
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంపై చర్చ
‘బిల్డింగ్ హెల్తియర్ కమ్యూనిటీస్ త్రూ కలెక్టివ్ యాక్షన్’ అంశంపై నాలుగో ప్యానెల్ చర్చ జరిగింది. టీవీఎస్ హెల్త్ కరస్పాండెంట్ మాధవి సిద్ధం మోడరేటర్గా వ్యవహరించారు. సెరిలింగంపల్లి డీసీపీ చ. శ్రీనివాస్, ఐపీఎస్, ఎస్సీఎస్సీ జాయింట్ సెక్రటరీ–హెల్త్కేర్, యశోద హాస్పిటల్స్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు, హైదరాబాద్ రన్నర్స్ వ్యవస్థాపకుడు రాజేశ్ వెట్చా, న్యూట్రిఫుల్ యూ వ్యవస్థాపకురాలు డాక్టర్ లహరి సురపనేని పాల్గొన్నారు. నివారణాత్మక వైద్యం, శారీరక దారుఢ్యం, పోషకాహారం, సామూహిక భాగస్వామ్యంతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని నిపుణులు వివరించారు.
పలువురికి సన్మానం
కార్యక్రమం ముగింపులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్, ఐపీఎస్ ప్యానెల్ సభ్యులు, ప్రముఖులు, ఇతర విశిష్ట అతిథులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఎస్సీఎస్సీ సీఈఓ నవేద్ ఆలం ఖాన్ కార్యక్రమానికి మాస్టర్ ఆఫ్ సెరిమనీస్గా వ్యవహరిస్తూ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. అనంతరం ఆయన కృతజ్ఞతలు, ముగింపు ప్రసంగం చేశారు. నెట్వర్కింగ్ కార్యక్రమం, విందుతో వార్షికోత్సవ వేడుకలు ముగిశాయి. రెండు దశాబ్దాల ఎస్సీఎస్సీ ప్రస్థానం పోలీస్–పరిశ్రమ–సమాజం మధ్య నిరంతర భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది. భద్రత, సైబర్ సెక్యూరిటీ, రోడ్డు భద్రత, ఆరోగ్యం, సామాజిక స్థైర్యం వంటి అంశాల్లో సహకారం, జ్ఞాన భాగస్వామ్యం, ఆచరణాత్మక పరిష్కారాలకు వేదికగా ఎస్సీఎస్సీ తన సేవలను కొనసాగిస్తోంది.


