ఝార్ఖండ్లో నక్సలిజం నిర్మూలన దిశగా భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. “నయీదిశా–నయీ పహల్” ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఆపరేషన్ నవజీవన్–2 ఫలితంగా కొల్హాన్,లాతేహార్ ప్రాంతాలకు చెందిన 16 మంది క్రియాశీల మావోయిస్టులు రాంచీలో ఝార్ఖండ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.వీరిలో రూ.15 లక్షల రివార్డు ప్రకటించిన ప్రాంతీయ కమాండర్ సంతోష్ అలియాస్ బసుదేవ్ కూడా ఉన్నాడు.లొంగుబాటు సందర్భంగా 11 అత్యాధునిక తుపాకులు, 38 మ్యాగజైన్లు, 1,562 రౌండ్ల మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఝార్ఖండ్ పోలీసులు, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు, ఝార్ఖండ్ జాగ్వార్ సంయుక్త చర్యల ఫలితమే ఈ విజయమని అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
