- నిర్మాణ అనుమతులు ఇవ్వదని గత ఎంఆర్ఓ ఆర్డర్
- నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నా ప్రస్తుత రెవిన్యూ అధికారులు
- ప్రభుత్వ భూముల్లో వందలాది భవనాలకు అనుమతులపై ప్రశ్నలు
- లక్షల్లో వసూళ్లు చేస్తున్నారని టౌన్ ప్లానింగ్ పై మండిపడుతున్న స్థానికలుకు
ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామంలోని సర్వే నంబర్లు 329/1 నుంచి 329/10 అనగా రవి నారాయణరెడ్డి కాలనీ, మహాదేవపురం, దేవేందర్ నగర్, వెంకటేశ్వర టెంపుల్ రోడ్డు, గౌతమి స్కూల్ బ్యాక్ సైడ్ అలాగే చుట్టుప్రక్కన వరకు ఉన్న భూములను ప్రభుత్వ భూములుగా పరిగణిస్తూ, వాటికి ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయవద్దని అప్పటి కుత్బుల్లాపూర్ తహసీల్దార్ 2024 సెప్టెంబర్ 13న జీహెచ్ఎంసీ గాజులరామారం సర్కిల్ 26- ప్రస్తుత (సిఎంసి సర్కిల్ 57) టౌన్ ప్లానింగ్ అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు.
తహసీల్దార్ లేఖలో, సర్వే నంబర్ 329 మొత్తం 255 ఎకరాలు 28 గుంటలు “గైరాన్ సర్కార్” (ప్రభుత్వ భూమి)గా రెవెన్యూ రికార్డుల్లో నమోదైందని, అలాగే సర్వే నంబర్లు 329/1 నుంచి 329/10 వరకు ఉన్న భూములు స్టాంపులు అలాగే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఏ కింద నోటిఫై చేయబడ్డాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ భూములకు సంబంధించిన వివాదం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఎలాంటి భవన అనుమతులు ఇవ్వరాదని సూచించారు. అయితే స్థానికుల ఆరోపణల ప్రకారం, ఈ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, సంబంధిత సర్వే నంబర్ల పరిధిలో వందలాది భవనాలు నిర్మాణం చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ అంశంపై రెవెన్యూ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం లోపించిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తహసీల్దార్ అధికారిక లేఖ వెలుగులోకి రావడంతో, ఈ సర్వే నంబర్లలో గతంలో జారీ చేసిన భవన అనుమతులు, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాలు, సంబంధిత అధికారుల బాధ్యతపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.



