ఆదాబ్ సైబరాబాద్, సైబరాబాద్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను కూకట్పల్లి ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) మరియు జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. చెల్లుబాటు అయ్యే పాస్పోర్టులు, వీసాలు లేకుండా నగరంలో నివసిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గాజులరామారం హెచ్ఏఎల్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో కొందరు బంగ్లాదేశ్ పౌరులు ఉంటున్నట్లు తెలిసింది. దీంతో జీడిమెట్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆ ఇంటిపై దాడులు నిర్వహించింది. సోదాల్లో ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులు అక్కడ నివసిస్తున్నట్లు గుర్తించారు. వారి పత్రాలను పరిశీలించగా పాస్పోర్టులు, వీసాలు లేదా భారత్లో నివసించేందుకు అవసరమైన చట్టబద్ధ పత్రాలు ఏవీ లేవని తేలింది. ప్రాథమిక విచారణలో వీరు అక్రమ మార్గంలో భారత్లోకి ప్రవేశించి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించిన అనంతరం హైదరాబాద్కు చేరుకున్నట్లు వెల్లడైందని జీడిమెట్ల ఎస్హెచ్వో జి. మహేశ్ తెలిపారు. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు పట్టుబడిన వారిపై నిర్బంధం, సంచార పరిమితి ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్కు తరలిస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం సంబంధిత అధికారుల ధ్రువీకరణతో వారిని బంగ్లాదేశ్కు బహిష్కరించే చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్న అధికారులు, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
