e-Paper
Thursday, July 30, 2026
HomeGHMCతెలంగాణలో మరో భారీ అవినీతి కేసు బహిర్గతం

తెలంగాణలో మరో భారీ అవినీతి కేసు బహిర్గతం

📰 Generate e-Paper Clip

డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు అక్రమాస్తులపై ఏసీబీ దాడులు.. రూ.13 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: తెలంగాణలో మరో భారీ అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. అవినీతి ద్వారా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు నివాసాలు, కార్యాలయాలతో పాటు మొత్తం 10 ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.13 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

సోదాల సందర్భంగా నరహరి రావు నివాసం నుంచి రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్ల నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అదనంగా రూ.5.04 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నట్లు తేలింది.

అధికారుల తనిఖీల్లో 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు లభించాయి. నరహరి రావు భార్య పేరిట రెండు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో ఐదు ప్లాట్లకు సంబంధించిన పత్రాలు, మహేశ్వరం మండలంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి వివరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా పుప్పాలగూడలో ఒక లగ్జరీ ఫ్లాట్, నార్సింగిలో రెండు ఫ్లాట్లు, రాజేంద్రనగర్‌లో మరో ఫ్లాట్, గచ్చిబౌలిలో జీ+3 భవనం, చత్రినాకలో జీ+2 నివాస భవనం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

అక్రమాస్తుల కేసులో నరహరి రావుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, ఆయనను కోర్టులో హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్ కోరనున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

  1. #ACBTelangana, #CorruptionCase, #NarahariRao, #DisproportionateAssets, #AntiCorruptionBureau, #HyderabadNews, #TelanganaNews, #ACBRaids, #CorruptionExposed, #BreakingNews, #IllegalAssets, #Rangareddy, #Gachibowli, #Narsingi, #Maheshwaram
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!