నేర నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని వ్యాఖ్య
ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్, జూన్ 18: నేరాల నియంత్రణకు ప్రజల సహకారం అత్యంత అవసరమని వికారాబాద్ డీఎస్పీ అంజయ్య పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని యువ నాయకులు, వ్యాపారవేత్తలు, సోషల్ మీడియా కార్యకర్తలతో తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ అంజయ్య మాట్లాడుతూ ప్రజా భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నేరాలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
అలాగే సురక్షిత వికారాబాద్ నిర్మాణంలో భాగంగా యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాలు, మహిళల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల భాగస్వామ్యంతో అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
అనంతరం యువ నాయకులు, వ్యాపారవేత్తలు, సోషల్ మీడియా కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించారు. ప్రజలతో సమన్వయం పెంచుకుంటూ పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కృషి చేస్తామని డీఎస్పీ తెలిపారు.
ఈ సమావేశంలో వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ రాకేష్ హీరేకర్, క్యూ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ జాక, ఈశ్వర్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ జాక, యువ నాయకులు తలారి అరుణ్, దోమ సంతోష్, శెట్టి మహేష్, కోటపల్లి సందీప్, రాము నాయక్, రాహుల్, అరుణ్ గుప్త, గందె వినయ్ తదితరులు పాల్గొన్నారు.
